కుట్ర కూలింది, నిజం తేలింది.. ఎన్డీఎస్ఏ ప్రకటనతో జలద్రోహం బట్టబయలు
మేడిగడ్డ బరాజ్లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ బరాజ్ గేట్లన్నీ తెరిచిపెట్టాలని సూచించింది. అదీగాక ఒకే రివర్బెడ్పై నిర్మించిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్లలో మేడిగడ్డ తరహాలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నదని, అక్కడ పరీక్షలు చేయాలని, అప్పటివరకు ఆ బరాజ్లను సైతం తెరిచిపెట్టాలని సూచించింది. ఏడాది తర్వాత 2025 ఏప్రిల్లో తుది నివేదిక సమర్పించింది. చేయాల్సిన పునరుద్ధరణ పనులపై మార్గదర్శకాలు జారీచేసింది. నివేదిక వచ్చినా ఏడాదిన్నరగా ఆ దిశగా పనులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ విషయమై ప్రభుత్వాన్ని స్వయంగా ఎన్డీఎస్ఏ చైర్మనే నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని, వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. అంతేకాదు బరాజ్ల నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు సైతం స్పష్టంచేశారు.