🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 24 Jul, 2026 | Page: 1

గంభీర్ విధానంపై అశ్విన్ విమర్శలు..

2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ.. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అమలు చేస్తున్న సెలక్షన్ విధానంపై టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్లకు బదులుగా.. అడపాదడపా రాణించే క్రికెటర్లపై ఆధారపడటం పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇది ఏమాత్రం సరైన వ్యూహం కాదన్నాడు అశ్విన్.
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో అశ్విన్ పలు కీలక అంశాల గురించి మాట్లాడాడు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలు జట్టుకు పెద్ద సవాలుగా మారాయని, అతనికి సరైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడంలో టీమ్ మేనేజ్మెంట్ విఫలమైందని పేర్కొన్నాడు. ప్రస్తుతం.. నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే పేర్లు వినిపిస్తున్నప్పటికీ, గాయాల బెడద కారణంగా వారిపై పూర్తిస్థాయిలో ఆధారపడటం కష్టమేనన్నాడు. దీనికి 2023 వన్డే ప్రపంచకప్‌ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. 'హార్దిక్ గాయపడిన సమయంలో నాటి కోచ్ రాహుల్ ద్రవిడ్ చక్కటి వ్యూహాన్ని అమలు చేశారు. ఆరో బౌలర్ కోసం వెతకలేదు. ఐదుగురు బౌలర్లతోనే జట్టును సమతూకంగా నడిపించి టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగారు' అని చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్రతి ఆటగాడికీ తన పాత్రపై స్పష్టత ఉండటం ద్రవిడ్ విధానంలో ప్రధాన బలమని ఈ మాజీ స్పిన్నర్ వివరించాడు.
🏠 Home