🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 27 Jul, 2026 | Page: 1

'అన్ని వివరాలు తెలుసుకున్నాకే మాట్లాడతా'- విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి ముమ్మర సమీక్ష!

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం రోజు దిల్లీలోని కర్తవ్య భవన్‌లో కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతల్ని అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన విద్యాశాఖలోని సీనియర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, నిర్ణయాలు, కార్యకలాపాలపై విస్తృత సమీక్ష ప్రారంభించారు. శాఖ పనితీరును పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే కీలక నిర్ణయాలు, ఇంకా విధానాలపై మాట్లాడతానని తెలిపారు. శాఖలోని అన్ని అంశాల్ని సమీక్షిస్తున్నానని, సీనియర్ అధికారులతో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనపై పూర్తి విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు.

'నిన్న కర్ణాటకలో ఉన్నాను. రాత్రి దిల్లీకి చేరుకొని ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించాను. శాఖకు సంబంధించిన అన్ని వివరాల్ని సమీక్షిస్తున్నాను. తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమాచారం సేకరిస్తూ, మొత్తం శాఖ పనితీరును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను' అని ప్రహ్లాద్​ చెప్పారు. విద్యాశాఖ తనకు కొత్త బాధ్యత అని, ఇది చాలా పెద్ద శాఖ అని పేర్కొన్నారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రహ్లాద్ జోషి 'ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. నాపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ బాధ్యతను వినయంతో, బాధ్యతతో నిర్వర్తిస్తాను' అని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- వెంటనే ప్రహ్లాద్ జోషి నియామకం
అంతకుముందు శనివారం రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి వర్గం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆమోదం తెలిపారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సిఫారసు మేరకు విద్యాశాఖ అదనపు బాధ్యతల్ని ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ప్రస్తుతం ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖతో పాటుగా పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ రెండు శాఖలకు అదనంగా విద్యాశాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టనున్నారు. గత మోదీ ప్రభుత్వంలో ఆయన బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించారు.

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకల ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ శనివారమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా వారి ఆకాంక్షలకు అనుగుణంగా తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల అక్రమాలపై కొనసాగుతున్న నిరసనల్ని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో పరీక్షల పారదర్శకత, విద్యా రంగంలో సంస్కరణలు, భవిష్యత్ విధానాలపై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.
🏠 Home