🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 27 Jul, 2026 | Page: 1

బంగాళాఖాతంలో వాయుగుండం- ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం!

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని, దీంతో ఒడిశాలోని పలు జిల్లాలకు ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. జూన్ 30 నుంచి ఇప్పటివరకు వర్ష సంబంధిత ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా బంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం శనివారం వాయుగుండంగా వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, వర్షాల తీవ్రత దృష్ట్యా కటక్, జగత్‌సింగ్‌పుర్, కేంద్రపారా, జాజ్‌పుర్, ఢెంకనాల్, అంగుల్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

చేపల వేటకు వెళ్లవద్దు!
మరోవైపు, ఒడిశాలోని మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో ఒడిశా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, మత్స్యకారుల వచ్చే నాలుగు రోజుల పాటు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ పేర్కొంది.

ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని భువనేశ్వర్ ఐఎండీ డైరెక్టర్ మనోరమా మహంతి పేర్కొన్నారు. జులై 27న పరదీప్-సాగర్ దీవి మధ్య తీరం దాటే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
🏠 Home