🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 28 Jul, 2026 | Page: 1

సాగర్ నీటితో చెరువులు నింపాలి

సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంత‌గిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ధ్యేయంగా స్వరాష్ట్ర సాధన జరిగిందని, సొంత రాష్ట్రంలో కూడా జిల్లాకు మొండి చేయి చూపి పాలేరుకు జలాలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోదాడ, హుజూర్‌న‌గ‌ర్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ దంపతులకు రైతుల గోస కనిపించడం లేదన్నారు. గతంలో కూడా జిల్లాలోని కాల్వ తూములను సీజ్ చేసి ఖమ్మం జిల్లాలకు నీటిని తరలించుకుపోయారని, తర్వాత వరద నీటితో తూముల్లో నీరు పారక కాల్వ‌ల‌కు గండ్లు, చెరువులు తెగిపోయి గ్రామాలు ముంపునకు గురైన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.
నీళ్ల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కండ్లకు పక్కా జిల్లాకు నీళ్లు పోతుంటే కనిపించడం లేదా అని ఆయ‌న ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ గాలి మోటర్లలో తిరుగుతూ ఉపయోగం లేని లిఫ్టులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉత్తమ్ దంపతులకు కాంట్రాక్ట్స్ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. వారం రోజుల్లో సాగర్ నీటితో కోదాడ నియోజకవర్గంలోని చెరువులు నింపకపోతే రైతుల పక్షాన నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చ‌రించారు.
🏠 Home