🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 01 Aug, 2026 | Page: 1

మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక నిద్ర మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇలా చేయండి..

మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్ద‌కం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్ల పనితీరు కూడా దెబ్బతింటుంది. అయితే కొన్ని సులభమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ప్యాంక్రియాస్‌ అధికంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్‌ పెరగడంతో మెదడులో సెరోటోనిన్‌, మెలటోనిన్‌ వంటి నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శరీరం మందగించి నిద్రమత్తు ఎక్కువగా అనిపిస్తుంది.
5 లేదా 10 నిమిషాలు న‌డ‌వండి..
అయితే ఈ కారణంగా మధ్యాహ్న భోజనం మానేయడం సరైన పరిష్కారం కాదు. బదులుగా భోజనం చేసిన తర్వాత కొన్ని చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే శరీరం చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చొని పని ప్రారంభించకుండా ఐదు నుంచి పది నిమిషాలు నడవడం మంచిది. కార్యాలయం పరిసరాల్లో చిన్న నడక చేయడం లేదా మెట్లు ఎక్కడం వంటి తేలికపాటి శారీరక వ్యాయామం రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పెంచి శక్తిని అందిస్తుంది. దీంతో నిద్రమత్తు తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. పుదీనా రుచి క‌లిగిన షుగర్ ఫ్రీ చ్యూయింగ్‌ గమ్‌ను కొద్దిసేపు నమలడం కూడా అప్రమత్తతను పెంచడంలో సహాయపడుతుంద‌ని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీనిని అధికంగా ఉపయోగించడం మంచిది కాదు.
🏠 Home