భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నిర్మితమైన తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి. మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా విమానాశ్రయంలోని ప్రయాణికుల టెర్మినల్ను సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీ సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, సాంకేతిక వ్యవస్థలు, టెర్మినల్ రూపకల్పన, ప్రయాణికులకు కల్పించిన వసతులపై జీఎంఆర్ ప్రతినిధులు ఆయనకు వివరించారు.