ఏఎస్ఐగా ఓ మహిళ నకిలీ అవతారం..
పంజాబ్ పోలీసులు ఓ నకిలీ మహిళా ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల పాటు ఆమె పోలీసు దుస్తుల్లో హల్చల్ చేసింది. ఫిరోజ్పూర్లో ఆమెను మోఘా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందిత వ్యక్తిని కోమల్ప్రీత్ కౌర్గా గుర్తించారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని మాలేవాలా గ్రామం ఆమెది. తనకు తాను ఓ పోలీసులా ఆమె గెటప్ వేసుకున్నది. సామాజికంగా గుర్తింపు పొందేందుకు పోలీసు శాఖలో ఏఎస్ఐగా చేస్తున్నట్లు చెప్పుకున్నది. అయితే ఓ మంచి కుటుంబం నుంచి అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు ఆమె పోలీసు వేషం వేసినట్లు తెలిసింది. నెల క్రితం ఓ వ్యక్తిని కూడా ఆమె పెళ్లాడింది. తప్పుడు గుర్తింపుతోనే ఆ పెళ్లి చేసుకున్నది.అయితే ఇంటి నుంచి రెగ్యులర్గా తెచ్చుకునే టిఫిన్ బాక్సు ఆమెను పట్టించింది. పోలీసు అని చెప్పుకుంటున్న కోమల్ప్రీత్ ప్రతి రోజు టిఫిన్ బాక్సును తీసుకువచ్చేది. మోఘా సిటీ-1 పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న సంజ్ కేంద్ర వద్దకు వెళ్లి అక్కడ తన టిఫిన్ బాక్సును పెట్టేది. స్థానిక పోలీసులు కూడా తమ బాక్సులను అక్కడే పెట్టేవాళ్లు. అయితే మెయిన్ చౌక్ వద్ద ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నానని ఆమె చెప్పుకునేది. ఇక ఓ గంట తర్వాత తిరిగివచ్చి, తన టిఫిన్ బాక్సును తీసుకుని వెళ్లేది. కానీ టిఫిన్ కోసం వచ్చే సమయంలో నిజమైన పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. డ్యూటీ రోస్టర్లో ఆ పేరుతో ఎవరూ లేరు కాదా అన్న డౌట్లో ఉండేవారు.రోజురోజుకూ ఆమెపై అనుమానాలు పెరిగిపోవడంతో.. తన బ్యాచ్ ఏంటి, పోస్టింగ్ డిటేల్స్, సీనియర్ ఆఫీసర్లు ఎవరు అని అడిగేవారు. ఆమె ఇచ్చే సమాధానాలు అక్కడి పోలీసులను సంతృప్తి పరిచేది కాదు. దీంతో ఆమె గురించి లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టారు. సెర్చింగ్లో ఆమె నుంచి పంజాబ్ పోలీసు యూనిఫామ్ను గుర్తించారు. రెండు వాకీ టాకీ సెట్లను, డిపార్ట్మెంట్ ఐడీ కార్డును ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆమె ధరించే యూనిఫాం.. అఫీషియల్గా ఉండేది. వాకీటాకీలు కూడా అఫిషియల్గా ఉన్నాయి. ఐడీ కార్డు కూడా ఒరినల్గా ఉండడంతో మొదట్లో ఎవరికీ అనుమానాలు రాలేదు. కానీ డ్యూటీ రోస్టర్లో ఆమె పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.