ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆయిల్ పామ్ సాగుతోనే రైతులక దీర్ఘకాలికంగా ఆర్ధిక స్థిరత్వం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం శంకర్గూడ గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీఓ మంద మకరంద్తో కలిసి గ్రామంలో స్వయంగా ఆయిల్ పామ్ మొక్కలను నాటి రైతులను ప్రోత్సహించారు రాజర్షి షా.ఆయిల్ పామ్ మొక్కలు నాటిన అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకసారి ఆయిల్ పామ్ తోటను ఏర్పాటు చేస్తే సుమారు 25 నుంచి 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని రైతులకు ఆయన సూచించారు.