కారణం లేకుండా బర్తరఫ్ చేశారు...కొండా సురేఖ
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనను ప్రశ్నించకుండా, కారణం కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమని ఆమె అన్నారు. ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, అలాంటిది కాంగ్రెస్లో ఇన్ని నెలలు పనిచేసిన తనకు కనీస వివరణ ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.తనపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎలాంటి కోపం లేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహితుల సంతోషం కోసమే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని కొండా సురేఖ ఆరోపించారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి లేదా అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయినప్పటికీ బీసీ మహిళ అయిన తనను కారణం చెప్పకుండా పదవి నుంచి తొలగించడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ సంతోషంగా లేరని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రులు తమ బాధలను బయటకు వచ్చి చెప్పుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో తమను గెలిపించుకోవడానికి గతంలో కాళ్లు మొక్కి ప్రచారం చేయించుకున్నవారే ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.