🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 17 Jun, 2026 | Page: 1

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్?

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పక్షానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 'ఆపరేషన్ టైగర్'పేరుతో సాగుతున్న ఈ పరిణామాల్లో భాగంగా.. శివసేన ఎంపీలు బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ కీలక భేటీ అనంతరం వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా స్వయంగా పాల్గొననున్నట్లు సమాచారం.

షిండే వైపు చూపు చూస్తున్న ఆరుగురు ఎంపీలు వీరేనా?

మొత్తం 9 మంది శివసేన లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనతో టచ్‌లో ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
పేర్లు:

1. సంజయ్ దినా పాటిల్(ముంబై నార్త్ ఈస్ట్)

2. సంజయ్ దేశ్‌ముఖ్(యావత్మాల్)

3. నాగేష్ పాటిల్ అస్తికార్(హింగోలి)

4. ఓంరాజే నింబాల్కర్(ధారాశివ్)

5. భావూసాహెబ్ వాక్‌చౌరే(శిరిడీ)

6. సంజయ్ జాదవ్(పర్భణీ)

వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. యాంటీ డిఫెక్షన్ (పార్టీ ఫిరాయింపుల) చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. మొత్తం 9 మందిలో 2/3 వంతు అంటే కనీసం ఆరుగురు ఎంపీలు విడిపోవాల్సి ఉంటుంది. ఈ తిరుగుబాటు ఎంపీలు ముందుగా లోక్‌సభలో ప్రత్యేక పక్షంగా ఏర్పడి, ఆపై జూన్ 19న 'శివసేన వ్యవస్థాపక దినోత్సవం' సందర్భంగా అధికారికంగా షిండే వర్గంలో విలీనం కావచ్చని తెలుస్తోంది.
🏠 Home