🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jun, 2026 | Page: 1

అజంజాహి మిల్లు కార్మికులకు 200 గజాల స్థలాలు ఇవ్వాలి


కుడా భూముల వేలం వెంటనే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్):
అజంజాహి మిల్లు కార్మికులకు హామీ ఇచ్చిన 200 గజాల స్థలాలను వెంటనే కేటాయించి, ఈ నెల 25న నిర్వహించనున్న కుడా భూముల వేలంపాటను రద్దు చేయాలని కాశిబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు రాజకీయ, కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 2002లో అజంజాహి మిల్లు మూతపడిన సమయంలో 452 మంది కార్మికుల్లో 134 మందికి మాత్రమే స్థలాలు కేటాయించారని, మిగిలిన 318 మంది కార్మికులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా భూములను వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు.

సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. కుడా వేలంపాటను వెంటనే రద్దు చేసి 318 మంది కార్మికులకు 200 గజాల స్థలాలు ఇవ్వాలని, అజంజాహి మిల్లు యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ స్థలంలో కార్మిక భవనం నిర్మించాలని, భూముల వేలాన్ని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో మాజీ మేయర్ డాక్టర్ టి. రాజేశ్వర్ రావు, సీపీఐ, బీజేపీ, సీపీఎం, సీఐటీయూ, పౌరహక్కుల సంఘం, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అజంజాహి మిల్లు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
🏠 Home