మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది. తదుపరి మ్యాచుల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఈ తరుణంలో హర్మన్ ప్రీత్ కౌర్ సేనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం(మే 17న) నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్కు గాయమైంది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి చీలమడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కాలు నేలపై పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్ను ఆసుపత్రికి తరలించారు.కాగా రిపోర్టులో శ్రేయాంక కాలి చీలమడమకు గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశముందని వెల్లడించారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్ చికిత్స తీసుకోనుంది. గతంలో ఆమె వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది.