స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
జనగాం, జూన్ 21 (సుదీక్ష న్యూస్): స్థానిక స్ప్రింగ్ వ్యాలీ గ్లోబల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ నలుసాని తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ రావుల ఉపేందర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వివిధ యోగాసనాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రావుల ఉపేందర్ బాబు మాట్లాడుతూ యోగా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
పాఠశాల చైర్మన్ నలుసాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి తమ పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.