🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 21 Jun, 2026 | Page: 1

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌కు ఘన నివాళులు

హనుమకొండ, జూన్ 21 (సుదీక్ష న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య, తెలుగు అకాడమీ చైర్మన్ శ్రీ కూరపాటి వెంకటనారాయణ, యువ నాయకులు శ్రీ విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. ప్రాంతం, వర్గం, కులం, మత భేదాలకు అతీతంగా తెలంగాణ ప్రజలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బలమైన సిద్ధాంత పునాది వేసిన మహనీయుడు జయశంకర్ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయం పాలన, సమాన అభివృద్ధి కోసం ఆయన దశాబ్దాల పాటు చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్య, ఉపాధి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, జయశంకర్ కలలు కన్న సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.ఈ సందర్భంగా నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన సేవలను స్మరించుకుని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాధవి రెడ్డి, బంక సరళ సంపత్, అంకుస్, నాగరాజు, రాజ్‌కుమార్, సారంగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home