🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 25 Jun, 2026 | Page: 1

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి


బీఎల్‌వోల ఇంటింటి ఫారాల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, సుదీక్ష న్యూస్:
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.

గురువారం హనుమకొండ పట్టణంలోని చైతన్యపురి ప్రాంతంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.

ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని పేర్కొన్న కలెక్టర్, అధికారులు, బీఎల్‌వోలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ పరిశీలనలో హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, సంబంధిత సిబ్బంది, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
🏠 Home