జూన్ 29న వరంగల్లో ఎంసిపీఐ(యు) రాష్ట్ర ఏకీకరణ నిర్మాణ సదస్సు
వరంగల్, జూన్ 25 (సుదీక్ష న్యూస్):
కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతం, పార్టీ ఏకీకరణ లక్ష్యంగా ఎంసిపీఐ(యు) రాష్ట్ర ఏకీకరణ నిర్మాణ సదస్సును ఈ నెల 29న వరంగల్ నగరంలోని అల్పాహారం కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలిపారు.
వరంగల్లోని ఓంకార్ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను అధిగమించి ఐక్యంగా ముందుకు సాగే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం ఇతర వామపక్ష పార్టీలతో కూడా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
దేశంలో పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు శక్తులు ఐక్యంగా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ హామీల అమలుపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఆశయ సాధనలో భాగంగా కమ్యూనిస్టు పార్టీలతో ఐక్యత చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జాతీయ నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, మోర్తాల చందర్ రావు, గోనె కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హంసారెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.