ఘనంగా ఏఐఎస్బీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వరంగల్, జూన్ 25 (సుదీక్ష న్యూస్):
అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ రోహిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐఎస్బీ రాష్ట్ర కన్వీనర్ హకీమ్ నవీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హకీమ్ నవీద్ మాట్లాడుతూ, 1951 జూన్ 25న కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన ఏఐఎస్బీ, గత 75 సంవత్సరాలుగా దేశంలో జాతీయ భావాలను పెంపొందిస్తూ, సోషలిజం లక్ష్యంగా విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ నాయకులు రోహిత్, సతీష్, హరీష్, శ్రీవాస్ తదితరులు పాల్గొన్నారు.