పేదల ఇళ్ల కూల్చివేతపై వామపక్షాల భారీ నిరసన
ఎమ్మెల్యే కూనంనేని సహా పలువురు నేతల అరెస్టు
హనుమకొండ, సుదీక్ష న్యూస్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పేదల గుడిసెల కూల్చివేతలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది పాల్గొన్న ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. అమరవీరుల స్థూపం వద్ద రోడ్డుపై బైఠాయించిన సందర్భంగా పోలీసులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, వామపక్ష కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకోగా, అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల హామీని అమలు చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. పెద్ద భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, పేదలపై కక్షసాధింపు చర్యలు ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గుడిసెలు కూల్చిన ప్రాంతాల్లోనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వామపక్ష నాయకులు జూలై 1న హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట పికెటింగ్, జూలై 6న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ(యూ), సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) తదితర పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.