🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 27 Jun, 2026 | Page: 1

రొట్టెల పండుగకు వచ్చి సముద్రంలో గల్లంతైన అన్నాచెల్లెళ్లు

జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు సముద్రంలో గల్లంతవడంతో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వారిని 11ఏళ్ల మహమ్మద్ సోఫియాన్, 17ఏళ్ల రుక్సానాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా సోమల మండలం కందుకూరుకు చెందిన మహమ్మద్ రఫి కుటుంబం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరయ్యేందుకు వచ్చింది. పండుగ కార్యక్రమాల అనంతరం కుటుంబ సభ్యులంతా సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా మహమ్మద్ సోఫియాన్, రుక్సానా సముద్రంలోకి వెళ్లగా ఒక్కసారిగా అలల ఉద్ధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లముందే పిల్లలు సముద్రంలో కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🏠 Home