🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 28 Jun, 2026 | Page: 1

అమెరికా, ఇజ్రాయెల్‌పై చట్టపరమైన చర్యలు..

ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన నేరాలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమన్నారు.

వీరి మరణాలకు బాధ్యులను చేస్తూ వేలాది కేసులు ఫైల్ చేయబోతున్నట్లు ఖమేని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. సాధారణ ప్రజల నుంచి దేశ అగ్రనాయకత్వం వరకు ఈ దాడుల్లో మరణించిన వారిని అమరులుగా అభివర్ణించారు. ఈ అంశంపై అమెరికా-జియోనిస్టులు (యూఎస్, ఇజ్రాయెల్ నేతలు) చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు తమకు ఆధారాలుగా ఉపయోగపడతాయని ఖమేని అన్నారు. దీనివల్ల అంతర్జాతీయ కోర్టులలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్ కోర్టులలో పోరాడుతుందన్నారు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
🏠 Home