Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇరాన్‌పై అమెరికా ముప్పేట దాడులు..

Author Neti Sudiksha | 13 Jul 2026, 10:58 AM | INTERNATIONAL
ఇరాన్‌పై అమెరికా ముప్పేట దాడులు..

అమెరికా, ఇరాన్ (USA, Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై ఇరాన్ (Iran) దాడులకు పాల్పడటంతో.. అమెరికా భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. గ‌డిచిన‌ 24 గంటల్లో మూడోసారి దాడుల‌కు పాల్ప‌డింది. దీన్నిబ‌ట్టి అక్క‌డి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవ‌చ్చు. తాజా పరిణామాలతో గల్ఫ్ ప్రాంతం (Gulf region) లో యుద్ధ వాతావరణం నెలకొన్న‌ది. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. ఇరాన్ దళాలను జవాబుదారీగా చేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారని తెలిపింది. గత మూడు రాత్రుల్లో దాదాపు 300కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలను, క్షిపణి వ్యవస్థలను, వాయు రక్షణ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తాజా దాడులు ఇరాన్ తీర ప్రాంతాలపై కేంద్రీకృతమయ్యాయని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో పేర్కొన్న‌ది.
అమెరికా దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ దళాలు ఓ పౌర నౌకపై కాల్పులు జరపడం గమనార్హం. అయితే వెంటనే రంగంలోకి దిగిన అమెరికా యుద్ధ విమానాలు.. ఇరాన్‌కు చెందిన ఒక క్రూయిజ్ క్షిపణిని, ఒక డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయని సెంట్‌కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ధ్రువీకరించారు. ఈ దాడులతో దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోగ‌ల‌ పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అయితే పౌర నష్టం జరగలేదని ప్రాథమికంగా వెల్లడించింది.
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం ఎదురుదాడులకు దిగింది. పొరుగున ఉన్న కువైట్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో తమ సరిహద్దులోని మూడు పోస్టులు దెబ్బతిన్నాయని కువైట్ ప్రకటించింది. అలాగే కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌పై డ్రోన్ దాడి జరుగ‌గా ఒక కార్మికుడు గాయపడ్డాడు. కువైట్‌లోని అమెరికా ‘హిమార్స్’ రాకెట్ లాంచర్లను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించగా.. ఆ ప్రచారాన్ని సెంట్‌కామ్ ఖండించింది. తమ సైనికులెవరూ గాయపడలేదని స్పష్టంచేసింది.