Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పేదల జోలికి వస్తే ఊరుకోం: దాస్యం వినయ్ భాస్కర్

Author Neti Sudiksha | 19 Jun 2026, 04:30 PM | TELANGANA
పేదల జోలికి వస్తే ఊరుకోం: దాస్యం వినయ్ భాస్కర్

కాజీపేట, జూన్ 19 (సుదీక్ష న్యూస్): పేదలకు అన్యాయం చేసే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఏ వర్గానికీ హాని చేయని అభివృద్ధిని మాత్రం స్వాగతిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తాను ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తినని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తనకు బాగా తెలుసని చెప్పారు. రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయం ఏర్పాటుకు గతంలో కృషి చేశానని, వివిధ సంఘాలు, అసోసియేషన్లకు కార్యాలయాల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించానన్నారు.
వైఎస్ఆర్ నగర్, చెరబండ రాజు కాలనీ వాసుల సమస్యలు తనకు తెలుసని, పేదల పక్షాన నిలబడి పోరాడతానని హామీ ఇచ్చారు. భద్రకాళి ఆలయ మాఢ వీధుల అభివృద్ధి కోసం గతంలో రూ.30 కోట్ల నిధులు తీసుకువచ్చామని, అయితే గుడిసెవాసులను తొలగించాలని తాను ఎప్పుడూ కోరలేదన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే బాధితులకు ప్రత్యామ్నాయంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇరవై ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్క గుడిసె కూడా కూల్చలేదని, పేద ప్రజల జోలికి ఎవరినీ రానివ్వలేదని తెలిపారు. కోర్టులను గౌరవిస్తూనే పేదల హక్కుల కోసం న్యాయపరంగా పోరాడుతానన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పేదలు, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా గులాబీ శ్రేణులు అండగా ఉంటాయని దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.