Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మెట్రోపై కేంద్రమంత్రులతో చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం - ఫేజ్‌-1 వాల్యుయేష‌న్‌, ఫేజ్-2 విస్తర‌ణ‌కు క‌న్సల్టెంట్‌ నియామకం

Author Neti Sudiksha | 23 Jun 2026, 05:16 PM | TELANGANA
మెట్రోపై కేంద్రమంత్రులతో చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం - ఫేజ్‌-1 వాల్యుయేష‌న్‌, ఫేజ్-2 విస్తర‌ణ‌కు క‌న్సల్టెంట్‌ నియామకం

హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జ‌రిపిన చ‌ర్చలు ఫలప్రదమయ్యాయి. కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్‌, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద‌యం ఖ‌ట్టర్‌ నివాసంలో ఈ అంశంపై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యుయేష‌న్‌, ఫేజ్‌-I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, మెట్రో ఫేజ్‌-II విస్తరణకు సంబంధించిన అంశాల‌ను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్రమంత్రులు, సీఎం ఏకాభిప్రాయానికి వ‌చ్చారు. క‌న్సల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను ఎంపిక చేశారు.

క‌న్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్​ కార్యాచరణ : మెట్రో ఫేజ్‌-I వాల్యుయేష‌న్‌, ఫేజ్‌-II విస్తరణ, ఇత‌ర అంశాల‌పై ఎస్బీఐ క్యాప్స్‌ స‌మ‌గ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్యత్‌ కార్యాచరణ చేపట్టనుంది. క‌న్సల్టెంట్‌ అధ్యయనం స‌మ‌యంలో స‌మన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు స‌మన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారు.

మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణపై చర్చ : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-2 విస్తరణపై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా రెండు రోజులు స‌మావేశ‌మ‌య్యారు. తొలుత సోమ‌వారం సాయంత్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇవాళ కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, అశ్వనీ వైష్ణవ్‌లతో కలిసి ఖట్టర్‌ను కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, మెట్రో రెండో దశ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డిలు కలిసిన సమయంలో సానుకూల స్పందన వచ్చింది. అంతేకాదు స్వయంగా రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఖట్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇవాళ కలుస్తారని కూడా తెలియజేశారు.

రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చ : ఇవాళ్టి ఖట్టర్‌ సమావేశంలో రైల్వే మంత్రి కూడా పాల్గొనడం శుభపరిణామంగా చెప్పొచ్చు. దిల్లీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలను చూస్తుంటే రెండు రోజులుగా సీఎం రేవంత్‌ రెడ్డి వివిధ శాఖల కేంద్రమంత్రులను కలవడంతో సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ముంబయి వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి, అక్కడి నుంచి ఆదివారం దిల్లీ వెళ్లారు. నిన్న, ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీలో మకాం వేసి కేంద్రమంత్రులతో వరుసగా సమావేశమవుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన సీఎం ప్రధానంగా మెట్రో విస్తరణ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్​ (ఐఆర్​ఎఫ్​సీ) నుంచి రుణ సదుపాయం, హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థ విస్తరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాను : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో సమావేశం ఏర్పాటు చేయమని కోరుతూ తనకు రెండుసార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. గత రెండు రోజులుగా తాను దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశానన్నారు. సోమవారం అశ్వినీ వైష్ణవ్​తో జరిగిన సమావేశం, కేంద్ర మంత్రి ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్​లతో జరిగిన సంయుక్త సమావేశం అనుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా, తాను ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.